తిమ్మాయపాళెం ఇనాం భూముల్లో అక్రమ దారుల చొరబాటు తాసిల్దార్ కు వినతి పత్రం ముత్యాల శివప్రసాద్
రైల్వేకోడూరు న్యూస్
తరతరాలుగా వస్తున్న తమ పూర్వీకుల ఇనాం భూములు అక్రమార్కుల పాలువుతున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని బాధితుడు ముత్యాల శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా చిట్వేలి మండలం తిమ్మాయపాళెం గ్రామానికి చెందిన భూముల వ్యవహారంలో జరుగుతున్న అన్యాయంపై ఆయన పత్రికాముఖంగా పలు వివరాలను వెల్లడించారు.
ఇనాం ఫే రిజిష్టరు ప్రకారం 1701 నాటి నుంచే జంగం కులానికి చెందిన ముత్యాల పెద్దవేములు సోదరులు 16 మందికి ఈ భూములపై హక్కులు లభించాయి. అందులో ప్రధాన ఇనాందారుగా ముత్యాల ముద్దు వీరప్ప రికార్డుల్లో ఉన్నారు. ఆ తదనంతరం 1969లో రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో ముత్యాల కన్నయ్యను పూర్వీకుల వారసుడిగా గుర్తిస్తూ శోత్రియం రిజిష్టరులో పేరు నమోదు చేశారు. శోత్రియం భూమిపై సర్వహక్కులు కలిగి ఉన్న కన్నయ్య, సుమారు 400 ఎకరాలకు పైగా భూమిలో పంటలు సాగు చేస్తూ ప్రభుత్వానికి శిస్తు కూడా చెల్లించారు. ఆయన కుమారులు ముత్యాల చిన్న వెంకటలింగం, ముత్యాల క్రిష్ణయ్య, ముత్యాల నాగమునేంద్రబాబుల పేరిట 1990లో చిట్వేలి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వీలునామా కూడా నమోదైంది.
జీవనాధారం కోసం వారసులు ఇతర ప్రాంతాలకు వెళ్లడాన్ని ఆసరాగా చేసుకుని, గ్రామానికి చెందిన కొందరు ప్రబల వర్గాల వ్యక్తులు వందల ఎకరాల ఇనాం భూములను ఆక్రమించి తోటలు సాగుచేసుకుంటున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి తమకే హక్కులున్నాయని ప్రచారం చేయడమే కాకుండా, గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇళ్ల స్థలాల పేరుతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారని శివప్రసాద్ ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి విచారణ జరిపి, ఆక్రమణలను అడ్డుకుని తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

