ఎస్. ఉప్పరపల్లిలో పల్లె నిద్ర కార్యక్రమానికి హాజరైన డీఎస్పీ
రైల్వేకోడూరు ప్రజాసేమ
రైల్వే కోడూరు మండలం ఎస్. ఉప్పరపల్లి గ్రామంలో నిర్వహించిన “పల్లె నిద్ర” కార్యక్రమానికి రేణిగుంట డీఎస్పీ . శ్రీనివాసరావు గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీఎస్పీ గారు గ్రామ ప్రజలతో సమావేశమై గ్రామంలోని శాంతిభద్రతలు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువస్తే, వాటిని చట్టపరంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డీఎస్పీ సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, ఘర్షణలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని తెలిపారు.అలాగే మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు, సైబర్ మోసాలకు గురైతే వెంటనే సైబర్ హెల్ప్లైన్ 1930కు సమాచారం అందించాలని సూచించారు.గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ మద్యం, గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల వినియోగం/రవాణా గురించి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

