మదనపల్లి, మార్చి 25:
అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పరీక్షలను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం హైటెక్ నిఘాను రంగంలోకి దించింది. *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు,* పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు.పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా, ఆకాశంలో ఎగిరే డ్రోన్ కెమెరాలు వారిని వెంటనే గుర్తించి పోలీసులను అలర్ట్ చేస్తాయి. ఈ విజువల్స్ అన్నీ నేరుగా కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయబడ్డాయి.పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉన్న అన్ని జిరాక్స్ షాపులను పరీక్షా సమయం ముగిసే వరకు తప్పనిసరిగా మూసివేయాలి. నిబంధనలు అతిక్రమించి షాపులు తెరిచినా లేదా సహకరించినా ఆ సెంటర్లను వెంటనే సీజ్ చేయడమే కాకుండా, నిర్వాహకులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ గారు స్పష్టం చేశారు.ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కేంద్రాల వద్ద గుంపులుగా నిలబడటం, అనవసరంగా తిరగడం పూర్తి నిషేధం. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడడమే మా ప్రథమ ప్రాధాన్యత. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించి పరీక్షలు విజయవంతం చేయాలి” అని ఎస్పీ పేర్కొన్నారు.

