హెచ్ఎం బాలగురు వెంకట విక్రమ్ వర్మకు ఘనంగా వీడ్కోలు పలికిన గ్రామస్తులు
రైల్వేకోడూరు న్యూస్
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం కే. బుడిగుంటపల్లి పంచాయతీ పరిధిలోని అయ్యవారిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలగురు వెంకట విక్రమ్ వర్మ శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభ భావోద్వేగ వాతావరణంలో జరిగింది. కొన్ని సంవత్సరాలుగా అయ్యవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా సేవలందించిన విక్రమ్ వర్మ, పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు క్రమశిక్షణ, విలువలతో కూడిన బోధనకు ప్రాధాన్యత ఇచ్చారు. పాఠశాల అవసరాల కోసం ప్రభుత్వం నిధులపైనే ఆధారపడకుండా తన సొంత నిధులను కూడా వినియోగించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేయించడం, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందేలా చర్యలు తీసుకోవడం, పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించడం వంటి కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తుల అభిమానాన్ని సంపాదించుకున్నారు.
- పదవీ విరమణ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా సన్మానించారు. పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనై అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బత్తిన గంగయ్య యాదవ్, దార్ల చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని విక్రమ్ వర్మ సేవలను కొనియాడారు. ఆయన చేసిన సేవలు గ్రామ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.