prajaseema.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 2:24 pm Digital Edition : PRAJA SEEMA DESK

సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.

పుంగనూరు ఫిబ్రవరి 12(నేటి పత్రిక ప్రజా సీమ): పుంగనూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో ఉండి చదువుకుంటున్న 9 మరియు 10వ తరగతి విద్యార్థినుల పుస్తక పఠనాన్ని మరియు నేర్చుకునే సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించారు. 6వ తరగతి చదువుతున్న బాలికను గణిత శాస్త్రం లోని సమస్యను పరిష్కరించాలని సూచించగా ఆ బాలిక సమస్యను పూర్తిగా పరిష్కరించడాన్ని స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులకు కంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతి గృహంలో.. బాలికలకు అందిస్తున్న వసతి సౌకర్యాలు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సదుపాయం తదితర అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వసతి గృహంలో చదువుకుంటున్న బాలికల చదువుకునే సామర్థ్యంపై దృష్టి పెట్టాలని, ఇంగ్లీష్ నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచాలని సైన్స్ మరియు గణిత శాస్త్రం పై దృష్టి సారించాలని సంబంధిత ఉపాధ్యాయులను ఆదేశించారు. వసతి గృహ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, ముఖ్యంగా బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాత్‌రూములు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, నీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం విద్యార్థినుల ఆరోగ్యానికి, విద్యాభ్యాసానికి ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. వసతి గృహంలో అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థినులు ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా తరచుగా ఏఎన్ఎంలు కంటి పరీక్షలు మరియు ఇతర పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.