పుల్లంపేట-(ప్రజా సీమ)
పుల్లంపేట మండలంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మండల ఎంపీపీ ముద్దా వెంకటసుబ్బారెడ్డి కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్ల పదవీకాలం ఏప్రిల్ 2న ముగియనున్నప్పటికీ, ప్రజలకు వారి అవసరం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. పదవి ముగిసినా గ్రామ అభివృద్ధి, ప్రజా సేవలలో ముందుండి సహకరించాలని సర్పంచ్లను కోరారు.
రాబోయే వేసవికాలంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే అవకాశముందని, ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల అవసరాలు తీర్చాలని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సందర్భంగా ఎమ్మార్వో సమావేశానికి హాజరు కాకపోవడాన్ని ఎంపీపీ తీవ్రంగా తప్పుపట్టారు. మండలంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ బాధ్యతగల అధికారి గైర్హాజరు కావడం దురదృష్టకరమని అన్నారు.
అలాగే ఇరిగేషన్ శాఖ పనులపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అనుమతులు లేకుండా పనులు చేపట్టి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. చెరువుల నుంచి అనధికారికంగా మట్టి తరలింపులు జరుగుతున్నాయని, దీనిపై అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.