వేంపల్లె నేటి పత్రిక ప్రజాసీమ:
గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లో చోరికి పాల్పడినట్లు బాధితురాలు పోలిసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే స్థానిక శ్లోకా పాఠశాల ప్రాంతంలో బాధితురాలు షేక్ అఖిల నివాసముంటున్నారు. బాధితురాలు కడప సమీపంలోని కొప్పర్తి డెక్సన్ సంస్థ సిసి కెమెరాల విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. భర్త ఇటివల మృతి చెందడంతో వేంపల్లె పట్టణంలోనీ శ్లోకా పాఠశాల ప్రాంతంలోని జమ్మిచెట్టు వద్ద నివాసం ఉంటున్నారు. డెక్సన్ సంస్థలో రాత్రి డ్యూటీ ఉండడంతో శుక్రవారం ఇంటికి బీగాలు వేసి, పిల్లలను తన తల్లి ఇంట్లో వదిలి వెళ్లారు. శనివారం డ్యూటీ నుంచి తిరిగి తన ఇంటికి చేరుకోగా బీగాలు పగులగొట్టి ఉన్న విషయాన్ని గుర్తించి తన తల్లిని పిలిపించి ఇంట్లోకి వెళ్లారు. బీరువా పగలగొట్టి బంగారు, వెండి తో పాటు రూ.50 వేలు నగదు అపహరణ చేసినట్లు గుర్తించారు. దీంతో ఆమె పోలిసులను ఆశ్రయించగా, సంఘటనా స్థలానికి పోలిసులు చేరుకుని పరిసరాలను పరిశీలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.