రాయచోటి;( ప్రజాసీమ)
రాయచోటి ప్రాంత విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించిందని, మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాల మంజూరు కావడం బీసీ విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు గొప్ప వరమని పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న పేర్కొన్నారు. ఈ నిర్ణయం గ్రామీణ మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితల దూరదృష్టితో పాటు రాయచోటి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక చొరవ ఫలితంగానే ఈ గురుకులం మంజూరైందని ఆయన తెలిపారు.ఎంజేపీ గురుకులం ద్వారా బీసీ విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి, ఆహారం, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ గురుకులం ఒక బలమైన వేదికగా నిలవనుందని అన్నారు.రాయచోటి ప్రాంత విద్యాభివృద్ధికి ఇది ఒక చారిత్రాత్మక ముందడుగని, వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే నిర్ణయంగా నిలుస్తుందని అంకన్న అభిప్రాయపడ్డారు. బీసీ విద్యార్థుల విద్యా అభివృద్ధి, సామాజిక సాధికారత కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని కోరుతూ, గురుకులం మంజూరుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం మరియు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.