మదనపల్లె(ప్రజా సీమ) కుటుంబ కలహాలు, విడాకుల నోటీసు నేపథ్యంలో ఓ మహిళ తన మూడేళ్ల కుమారుడితో కలిసి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది.తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట మండలం మల్లెల గ్రామానికి చెందిన సోనియా, తన కుమారుడు మహమ్మద్ కియాన్తో కలిసి మదనపల్లె గరుడనగర్లోని బంధువుల ఇంటికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త, అత్తమామల వేధింపులతో పాటు విడాకులకు సంబంధించిన నోటీసు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు వారు ఆరోపించారు.ఘటనకు ముందు సోనియా సూసైడ్ నోట్ రాసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాల్సి ఉంది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లీకుమారుడిని వెంటనే మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.సమాచారం తెలుసుకున్న మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ భాష ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడితే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.