prajaseema.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 3:25 pm Digital Edition : PRAJA SEEMA DESK

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారుల నిర్మాణమే కీలకం

మొలకలచెరువు మండలంలో నరేగా నిధులతో నిర్మించిన రహదారిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

ములకలచెరువు, ఫిబ్రవరి 11(ప్రజాసీమ): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారుల నిర్మాణమే కీలకమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.  జిల్లాలోని మూలకలచెరువు మండలంలో 90 లక్షల రూపాయల నరేగా నిధులతో… కదిరి రోడ్డు నుండి కనుగొండ రాయ స్వామి దేవాలయం వరకు నిర్మించిన రహదారిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నరేగా నిధులతో నిర్మించిన రహదారులపై పలు వివరాలను జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి దయాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఈ సంవత్సరం మార్చిలోగా 51 కోట్ల రూపాయల నరేగా నిధులతో పూర్తి చేయాల్సిన రహదారుల నిర్మాణాలను మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తంగా 2025-26వ సంవత్సరానికి 75 కోట్ల రూపాయల నరేగా నిధులతో రహదారుల నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమంలో పూర్తి చేయాల్సిన 17 పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా నిర్మాణంలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, ప్రతి దశలో సాంకేతిక ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ ప్రజలు నివసించే గ్రామాలతో అనుసంధానం కల్పించే రహదారులకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద తక్షణ అనుమతులు పొంది పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వెనుకబడిన వర్గాల నివాస ప్రాంతాలకు మౌలిక వసతులు చేరే విధంగా ప్రాధాన్యతా క్రమంలో ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతులు పొంది పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదల మరియు సామాజిక అభివృద్ధి సాధనలో మౌలిక సదుపాయాల నిర్మాణమే కీలకమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.