prajaseema.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 1:23 pm Digital Edition : PRAJA SEEMA

ఒంటిమిట్ట లో కళ్యాణానికి శుభారంభం

ఒంటిమిట్ట(ప్రజా సీమ)  కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రసిద్ధ ప్రాచీన ఆలయం శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం పవిత్రమైన హరిద్ర ఘటనం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలు మరియు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలకు శ్రీకారం చుట్టే తొలి ఆచారంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా భక్తులు, శ్రీవారి సేవకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపు కొమ్ములను దంచే పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

ప్రాధాన్యం :

హరిద్ర ఘటనంలో సిద్ధం చేసిన తాజా పసుపును స్వామివారికి నిర్వహించే స్నపన తిరుమంజనం కార్యక్రమంలో ఉపయోగిస్తారు. అలాగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి అవసరమైన తలంబ్రాలు సిద్ధం చేయడానికి కూడా దీనిని వినియోగిస్తారు.

కార్యక్రమం విధానం :

ముందుగా పసుపు కొమ్ములు ఇతర పరికరాలను గర్భాలయంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మి ఆరాధన చేశారు. శ్రీ సూక్తం పఠనానంతరం హరిద్ర ఘటనం నిర్వహించారు.పసుపు నూరిన తరువాత సమర్పణ చేసి తాంబూలం అందజేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, డీఈ (ఎలక్ట్రికల్) శ్రీమతి సరస్వతి, పీఆర్‌ఓ ఎఫ్‌ఏసీ కుమారి నీలిమ, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.