నరసరావుపేట: ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, పల్నాడు జిల్లా పౌర సరఫరాల అధికారి వినియోగదారులకు కీలక సూచనలు చేశారు. జిల్లాలోని గృహ అవసరాల (Domestic) LPG వినియోగదారులు ఆందోళన చెందవద్దని, సిలిండర్ నమోదు చేసుకున్న వారికి 3 నుండి 8 రోజుల లోపు డెలివరీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వినియోగదారులు అవసరం మేరకు మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని, కింది నిబంధనలను పాటించాలని ఒక సిలిండర్ తీసుకున్న 25 రోజుల తర్వాత మాత్రమే తదుపరి బుకింగ్కు అవకాశం ఉంటుంది.సిలిండర్ తీసుకున్న 45 రోజుల కాలవ్యవధి దాటిన తర్వాతే మరో సిలిండర్ బుక్ చేసుకోవాలి.
*అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు*
గ్యాస్ ఏజెన్సీల డెలివరీ బాయ్స్ ఎవరైనా సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయించినా, లేదా గృహ అవసరాల సిలిండర్ల నుండి కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్ను రీ-ఫిల్లింగ్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి అక్రమాలు గమనిస్తే వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్: 08647-252999 కు ఫిర్యాదు చేయాలని కోరారు.
జిల్లాలో కమర్షియల్ సిలిండర్ల సరఫరాను కూడా మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కావున వ్యాపార సంస్థలు గృహ అవసరాల కోసం కేటాయించిన డొమెస్టిక్ సిలిండర్లను వాడకూడదని అధికారి ఇందుమూలంగా తెలియజేశారు.